హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాయవద్దని, ప్రజల ఆరోగ్యం పరాచికాలు ఆడొద్దని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రానికి హితవు చెప్పారు. విపక్షాలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా తాము ఏ చట్టమైనా తెస్తామనే ఆధిపత్య ధోరణిని కేంద్రం అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజ్యసభలో ‘ప్రైవేట్ మెడికల్ బిల్లు-రైట్ టు హెల్త్ బిల్లు 2021’పై జరిగిన చర్చలో కేశవరావు మాట్లాడుతూ.. కేంద్రం వైద్యవిద్యను నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం ఇప్పటివరకు తెలంగాణకు వైద్యవిద్యకు పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
దేశంలో సగటు భారతీయుడు కుటుంబ వ్యయంలో 61% వైద్యానికే ఖర్చుచేస్తున్నాడని, ఈ భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. ఇలాంటి సామాజిక అంశాలను బిల్లు పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు. బిల్లులో టీఆర్ఎస్ పక్షాన కేకే పలు అంశాలను చేర్చాలని ప్రతిపాదించారు. ప్రకృతి వైపరీత్యాలు, స్వచ్ఛమైన తాగునీరు, కాలుష్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి.. అవి వైద్యవిద్యలో ఏ మేరకు దోహదం చేస్తాయో ఆలోచించి సవరణలు చేయాలన్నారు.
నన్ను మాట్లాడనివ్వండి
తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను కేకే వివరిస్తుండగా.. ‘మీకు ఇచ్చిన సమయం రెండు నిమిషాలే.. ఇప్పటికే 5 నిమిషాలు పూర్తయింది. త్వరగా ముగించండి’ అని రాజ్యసభ చైర్మన్ పేర్కొనడంతో కేకే తీవ్రంగా స్పందించారు. ప్రజల జీవించే హక్కుకు సంబంధించి అందునా అత్యంత ప్రాముఖ్యం ఉన్న బిల్లుపై రెండు నిమిషాల్లో ముగించమంటే ఎలా? అని నిలదీశారు. తాను బిల్లులోని అంశాలు కాకుండా వేరే ఇతర అంశాలపై కనీసం ఒక్కమాట మాట్లాడితే… ‘నన్ను మాట్లాడనివ్వకండి. లేదంటే మాట్లాడనివ్వండి’ అని కేకే ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయనకు మాట్లాడేందుకు సమయం కేటాయించడం గమనార్హం.