MP Santosh | అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రమన్నారు.
కొందరు వ్యక్తులు కొండపై రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. భక్తిభావం తొణికిసలాడాల్సిన చోటును రాజకీయాలకు వేదికగా చేసుకోవడం భావ్యం కాదన్నారు. తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు చేసే వారిని నిరోధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపై రాజకీయాలు చేయకుండా కఠిన నిబంధనలు రూపొందించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని కోరారు.