హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఆంజనేయ స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంకల్పిస్త్తే.. అక్కడి అటవీ ప్రాంతం అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని వెయ్యి ఎకరాలకుపైగా ఉన్న జగిత్యాల జిల్లా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని (కొడిమ్యాల) దత్తత తీసుకుంటున్నట్టు ఎంపీ సంతోష్ గురువారం ప్రకటించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు కొండగట్టు అభివృద్ధిలో గ్రీన్ ఇండియా చాలెంజ్ను కూడా భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు కలిపి మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్టు సంతోష్ ప్రకటించారు. అన్ని రంగాల్లో అభివృద్ధితోపాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కేసీఆర్ కాంక్షిస్తున్నారని తెలిపారు.
కాళేశ్వరం నిర్మించినా, యాదాద్రిని పునర్ నిర్మించినా, ఇప్పుడు కోటి మొకుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి నిర్ణయమైనా కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయాల్లో ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం తొణికిసలాడుతాయని అన్నారు. అభివృద్ధి నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని పేర్కొన్నారు.
కొండగట్టు దేవస్థానంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ గుర్తు చేసుకొన్నారు. చిన్నతనం నుంచే కేసీఆర్ వెన్నంటే ఉన్న తనకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉన్నదని, అనేకసార్లు ఆంజనేయుడిని దర్శించుకొని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయని తెలిపారు. కొండగట్టు అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం తనకు దక్కిన ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు ఎంపీ పేర్కొన్నారు.
అడవికి పునరుజ్జీవం
గ్రీన్ ఇండియా చాలెంజ్, దత్తతలో భాగంగా కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ సంతోష్ ప్రకటించారు. పచ్చదనం పెంచి.. అడవికి పునరుజ్జీవనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ చర్యలతోపాటు అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సహజ అడవి పునరుద్ధరణకు చెక్డ్యామ్ల నిర్మాణంతోపాటు నేలలో తేమ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆలయ పరిసరాల్లో భారీ సంఖ్యలో సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్దఎత్తున పండ్ల మొకలు నాటి మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు పచ్చని ప్రకృతి మధ్య సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతాని, వాకింగ్ ట్రాక్తోపాటు, పగోడాల (వాచ్టవర్స్) ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఐదు వందల ఏండ్లకు ముందే అస్తిత్వంలోకి వచ్చిన కొండగట్టు ఆలయంలో.. దేవుని పూజ కోసం ఈ అడవిలో లభించే సుగంధ మొకలు, చందనం చెట్ల ఉత్పత్తులనే వినియోగించే వారని తెలిపారు. మళ్లీ ఆ వైభవం తీసుకొచ్చేలా అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఔషధ మొకలు, సుగంధ మొకలు నాటుతామని పేర్కొన్నారు. మొదటి విడతలో రూ.కోటి వ్యయంతో అడవిలో పచ్చదనం పెంచే చర్యలు తీసుకుంటామని, దశలవారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామని ఎంపీ వెల్లడించారు.