హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల టూరిజం ఉన్నతాధికారులు అభినందించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్న FITUR – 2023లో తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపదను తెలిపారు. పర్యాటకులకు కనువిందు చేసే జలపాతాలు, సెలయేర్లు, దేవాలయాలు, వైల్డ్ టూరిజం, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్ సాంస్కృతి, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి కర్ణాట, రాజస్థాన్ రాష్ట్రాల టూరిజం అధికారులకు శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల టూరిజం శాఖల మధ్య పర్యాటకులను ఆకర్షించేందుకు సమన్వయం ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. వివిధ రాష్ట్రాల మధ్య టూరిజం కేంద్రాల సమాచారాన్ని పరస్పరం అందజేసుకోవడం వల్ల పర్యాటకులకు ఎక్కువ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. భారతదేశం భిన్న సంస్కృతులకు కేంద్ర బిందువు అని అన్నారు. ప్రపంచ కీర్తి కిరీటంలో బుద్ధవనం ప్రాజెక్టు గొప్ప మైలురాయిగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాము. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి దేవాలయం, వేములవాడ, మన్యంకొండ లక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయం, కొండగట్టు లాంటి చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఇండియా టూరిజం అదనపు సెక్రటరీ రాకేష్ వర్మ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాజస్థాన్ టూరిజం ముఖ్య కార్యదర్శి గాయత్రీ రాథోడ్, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మేంద్ర సింగ్ రాథోడ్, కర్ణాటక రాష్ట్ర టూరిజం అడ్వైజర్ హెచ్టీ రత్నాకర్, ఐవోటీఏ వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, రాజస్థాన్ టూరిజం ఎండీ విజయ్ పాల్ సింగ్, తెలంగాణ టూరిజం డిప్యూటీ కమిషనర్ ఓం ప్రకాష్, ఇతర రాష్ట్రాల టూరిజం అధికారులు పాల్గొన్నారు.