Congress | రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేకే మహేందర్రెడ్డి, ఉమేశ్రావు హాజరయ్యారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కొందరు యువకులకు ఉమేశ్రావు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని మండల అధ్యక్షుడు బాల్రెడ్డి ఉమేశ్రావును నిలదీశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. గొడవను సద్దుమణిగించాల్సిన నేతలు కేకే మహేందర్రెడ్డి, చీటి ఉమేశ్రావు కార్యాలయం నుంచి జారుకున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కొడుకు, యూత్కాంగ్రెస్ జిల్లా నాయకుడు వింకు చేరుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు.