రాజన్న లడ్డూకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్న ఈ మహాప్రసాదానికి ఏటేటా డిమాండ్ పెరుగుతున్నది. గతేడాది 70 లక్షల పైగా లడ్డూలను విక్రయించగా, రెట్టింపు ఆదాయం సమకూరింది. తిరుమల తిరుపతి తర్వాత రాయేశుడి ప్రసాదానికి ప్రాశస్థ్యం లభిస్తున్నది.
వేములవాడ, మే 12: ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. రాజన్నను దర్శించుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ లడ్డూలను 1960 నుంచి విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ మహా ప్రసాదానికి డిమాండ్ పెరిగింది. రుచి, శుచికరంగా తయారుచేయడమే అందుకు కారణం అని చెప్పవచ్చు. ప్రత్యేక రోజుల్లో సుమారు 50 వేల వరకు, మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో సుమారు 3లక్షల వరకు లడ్డూలను విక్రయిస్తున్నారు. 2021-22 లో 40లక్షల లడ్డూలు విక్రయం కాగా, 2022-23లో 70లక్షల లడ్డూ ప్రసాదం విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 14కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.
లడ్డూ తయారీ ఇలా..
రాజన్న ఆలయంలో లడ్డూలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారు. ప్రధానంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. కిలో శనగపిండికి, 2 కిలోల పంచదార, 650 గ్రాముల నెయ్యి, 75 గ్రాముల కాజు, 50 గ్రాముల కిస్మిస్, ఆరు గ్రాముల యాలకులు, గ్రాము పచ్చ కర్పూరం, గ్రాము జాజికాయను కలుపుతారు. ప్రస్తుతం 20 రూపాయలకో లడ్డూను విక్రయిస్తున్నారు.
ఏటేటా డిమాండ్
పరిశుభ్రమైన వాతావరణంలో స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నాం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 70లక్షల లడ్డూలు విక్రయించాం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ప్రసాదాన్ని ఇష్టపడి కొనుగోలు చేశారు. మన ప్రసాదానికి భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది.
– ప్రతాప నవీన్, ఆల