హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): రైతుబంధు సమితి చైర్మన్గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి.. రాష్ట్ర సాగు చిత్రాన్నే మార్చేశారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలకు మేలు చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ మానస పుత్రికైన రైతుబంధు సమితి చైర్మన్గా తనను నియమించడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. 1.60 లక్షల మంది సభ్యులు గల ఈ రైతుబంధు సమితిని రైతులకు చేరువ చేసి సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజయ్య సతీమణి ఫాతిమామేరి, కుమారుడు డాక్టర్ క్రాంతిరాజ్, కోడలు డాక్టర్ సింధూరి, ఉద్యానశాఖ కమిషనర్ హన్మంతరావు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హన్మంతు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.