చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 31: మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనుచరగణం స్వైరవిహారం చేసింది. సోమవారం ప్రచార సమయం ముగిసిన తర్వాత రాత్రి బాగా పొద్దుపోయాక గ్రామాలకు వచ్చిన బీజేపీ అభ్యర్థి.. ఆయన అనుచర గణం తమ వాహనాల్లో ముందే తెచ్చుకొన్న రాళ్లు, కర్రలతో గ్రామస్థులపైన, కవరేజీకి వచ్చిన పాత్రికేయులపైన విచ్చలవిడిగా దాడి చేశారు. రాజగోపాల్రెడ్డి.. చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామ పరిధి రెడ్డిబావి (సైదాబాద్)కి ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరేండ్లు అయినా ఎన్నడూ గ్రామానికి రాలేదని.. ఇప్పుడెందుకొచ్చారని గ్రామస్థులు నిలదీశారు.
దీంతో రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామస్థులపై దుర్భాషలాడారు. తన అనుచరులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన బీజేపీ కిరాయి గూండాలు గ్రామస్థులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు మహిళల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. రాజగోపాల్రెడ్డిపై ఆగ్రహించిన గ్రామస్థులు చెప్పులు చూపిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తంచేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రచారం పూర్తికాకుండానే రాజగోపాల్ వెనక్కి మళ్లారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలోనూ రాజగోపాల్రెడ్డికి గ్రామస్థుల నుంచి నిలదీతలు, నిరసనలే ఎదురయ్యాయి. ప్రచార సమయం ముగిశాక రాత్రివేళ గ్రామానికి వచ్చిన రాజగోపాల్రెడ్డిని గ్రామస్థులు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఏం చేశారంటూ ప్రశ్నించారు. దీంతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కర్రలతో విరుచుకుపడటంతో పలువురికి గాయాలయ్యాయి.
టీఆర్ఎస్ శ్రేణులపై దాడి
అంకిరెడ్డి గూడెంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఇదే సీన్ రిపీట్ చేశారు. సమయం ముగిసిపోయిన తర్వాత ప్రచారానికి వచ్చారు. గ్రామంలోని రచ్చబండ దగ్గర ప్రసంగించడానికి వస్తుండగా పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యాలయం ముందున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. సమయం ముగిశాక ప్రచారం చేయడమేమిటని అక్కడే ఉన్న పోలీసులను ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యాలయంపైకి దూసుకుకొచ్చారు. అడ్డుకోబోయిన టీఆర్ఎస్ శ్రేణులపై వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో పాటు భౌతిక దాడులు కూడా జరగటంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
దాడులు హేయం: హరీశ్రావు
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం ప్రజలపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కిరాయి గూండాల దాడిని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. గ్రామస్థులపై దాడిచేయడం హేయమైన చర్య అన్నారు. వార్తను కవర్చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపైనా దాడి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఓటువేసిన పాపానికి ప్రజలపైనే తిరగబడటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలపైనే గూండాగిరీ చేసిన బీజేపీ అభ్యర్థికి గుణపాఠం తప్పదన్నారు. అంకిరెడ్డి గూడెంలో కార్లలో కట్టెలు, రాళ్లు తీసుకొచ్చి.. టీఆర్ఎస్ కార్యకర్తలపైనా.. పార్టీ ఆఫీసుపైనా దాడిచేసి అరాచకం సృష్టించడం హేయమన్నారు. ఇలాంటి వ్యక్తులకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారని మంత్రి హరీశ్రావు అన్నారు.