జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) /భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లిలో వివాదాస్పదంగా మారిన ఓ స్థలం విషయంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గతంలో పలువురు అధికారులను ఏసీబీకి పట్టించిన ఈయనపై పలువురు కక్ష పెంచుకోగా, తాజాగా స్థానిక పోలీస్స్టేషన్ ముందున్న భూమి పంచాయితీలో జోక్యం చేసుకోవడం, కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల దాకా వెళ్లింది.
ఈ క్రమంలో రాజలింగమూర్తిపై ఓ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాతే ఈ హత్య జరగడం అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి (48) బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్ నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం మీదుగా రెడ్డికాలనీ వైపు వెళ్తున్నారు. అక్కడ కాపుగాసిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు.
స్థానికులు చేరుకునేలోగా దుండగులు పారిపోయారు. రాజలింగమూర్తిని జిల్లా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువులు దవాఖానకు చేరుకొని ఆందోళనకు దిగారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేశ్ పరిస్థితిని పర్యవేక్షించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దవాఖానకు చేరుకొని మృతుడి బంధువులను పరామర్శించారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాజలింగమూర్తి హత్య ఘటన పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్తోపాటు వీఆర్వోను ఏసీబీకి పట్టించాడు. అప్పటి నుంచి అతడిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందున్న రేణిగుంట్ల కుటుంబానికి సంబంధించిన భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని ఆ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. 171 సర్వేనంబర్లోని అటవీ శాఖ భూమిలో సైతం రాజలింగమూర్తి తలదూర్చడంపై పలువురు గుర్రుగా ఉన్నారు. రాజలింగమూర్తి గతంలో మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్యకు వ్యతిరేకంగా కేసు వేయడంతోపాటు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుపై కూడా కేసులు వేశాడు.
రేణిగుంట్ల కుటుంబ సభ్యులపై సైతం భూముల విషయమై కేసులు వేయడంతో కోర్టులో కొనసాగుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రేణిగుంట్ల కుటుంబ సభ్యుల భూమిలో రాజలింగమూర్తి జోక్యం చేసుకోవడంతో 15 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై రేణిగుంట్ల కుటుంబ సభ్యులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారంలోగానే రాజలింగమూర్తి హత్యకు గురికావడం అనుమానాలకు తావిస్తున్నది. పోలీసులు సైతం రేణిగుంట్ల కుటుంబ సభ్యులు, రాజలింగమూర్తికి మధ్య జరిగిన తగాదాలే హత్యకు దారి తీసినట్టు అనుమానం వ్యక్తంచేస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
రాజలింగమూర్తిపై ఇప్పటికే పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. సీసీ 1191 2023, సీసీ 793 2023, ఎస్టీసీ ఎన్ఐ 25 2023, సీసీ 4187 2022, సీసీ 3146 2022, సీసీ 5286 2022, సీసీ 2876 2022, ంఎస్ 158, 2024, సీసీ 11 2024, ఎస్టీసీ ఎన్ఐ 49, 2024, ఓఎస్ 97 2024 కేస్ నంబర్లతో రాజలింగమూర్తిపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజలింగమూర్తి వర్సెస్ రేణుకుంట్ల చంద్రయ్య, చెన్న బోయిన రాజు, స్టేట్ ఆఫ్ తెలంగాణ పై ఈ కేసులు నమోదయ్యాయి.