హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో వచ్చిన అత్యుత్తమ సంస్కరణ రైతుబంధు పథకమని, ఒక విధంగా ఇది గేమ్ ఛేంజర్ వంటిదని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (సిఫా) ముఖ్య సలహాదారు పీ చెంగల్రెడ్డి అన్నారు. రైతుబంధుతో రైతుకు భరోసా దక్కిందని, ప్రపంచంలోనే ఇది యూనిక్ పథకమని చెప్పారు. విత్తనాలు, ఎరువులు తదితరాలకు రైతుకు పెట్టుబడి ఒక ప్రాథమిక అవసరమన్నారు. రైతుబంధుతో ఆ ప్రాథమిక అవసరాలన్నీ తీరుతాయని చెప్పారు. దీనికితోడు కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి పుష్కలమైన సాగునీటిని, ఉచితంగా నిరంతరాయ విద్యుత్తును అందిస్తున్నదని, దీంతో రాష్ట్రంలో వ్యవసాయం భారీగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. రైతుబంధు గ్రామీణ
వ్యవసాయాభివృద్ధికి ప్రపంచంలోనే వినూత్నంగా సీఎం కేసీఆర్ చేసిన రెండు ప్రధానమైన పనులున్నాయి. ఒకటి రాష్ట్రంలో కరువును పారదోలే విధంగా నీళ్లిచ్చారు. రెండోది ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం రూపంలో మౌలిక వసతులు కల్పించారు. తెలంగాణ, రాయలసీమ, బుందేల్ఖండ్, బీదర్.. కరువుకు కేరాఫ్ ప్రాంతాలు. వీటిలో ఒక్క తెలంగాణలోనే కరువును నివారించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించారు. ఇది యూనిక్. ఇది నేను ప్రత్యక్షంగా నిర్వహించిన సర్వే ఆధారంగా చెప్తున్నాను. దేశంలో ఇంతకు మించి ఏ రాష్ట్రమూ చేయలేదు.
-పీ చెంగల్రెడ్డి, సిఫా ముఖ్య సలహాదారు ఆర్థికవ్యవస్థ వృద్ధికి పెద్దఎత్తున ఊతం ఇచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, ఇతర అంశాలపై చెంగల్రెడ్డి తన అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పంచుకున్నారు..
రైతుబంధు పథకంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
రైతుబంధు చాలా మంచి పథకం. పెట్టుబడి సాయం ప్రతి రైతుకు ప్రాథమిక అవసరం. దాన్ని ప్రభుత్వమే అందించటం ప్రశంసనీయం. రైతుబంధు ద్వారా వ్యవసాయరంగంలో సీఎం కేసీఆర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే రూ.5వేలతో రైతులకు విత్తనాలు, ఎరువుల కొనుగోలు సులభమవుతుంది. ఒక్క రైతుబంధు పథకానికే రూ.50వేల కోట్లకు పైగా ఖర్చు చేయటం గొప్ప విషయం. రైతులపై, వ్యవసాయంపై ఈ ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇప్పటికే నీళ్లు అందించారు. ఒక రైతుకు నీళ్లు, ఎరువులు, విత్తనాల కన్నా ఇంకేం కావాలి? నా దృష్టిలో రైతులకు ఈ మూడు అందించిన వారు సీఎం కేసీఆర్ మినహా దేశంలో మరొక్కరు లేరు.
వ్యవసాయంపై కేంద్రం వైఖరి.. వ్యవసాయం అభివృద్ధికి అది తీసుకుంటున్న చర్యలేమిటి?
వ్యవసాయరంగం విషయంలో కేంద్రంలోని ప్రస్తుత, గత ప్రభుత్వాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. ప్రధాని మోదీ కూడా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అధికారంలోకి రాకముందు వ్యవసాయం గురించి ఎన్నో హామీలిచ్చిన మోదీ.. ఆ తర్వాత అవన్నీ మర్చిపోయారు. గడిచిన ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేపట్టలేదు. వ్యవసాయరంగానికి సంబంధించిన సర్వాధికారాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకొని పెద్ద తప్పు చేస్తున్నది. వ్యవసాయ విధానాలను వికేంద్రీకరించాలి. రాష్ర్టాలకు కూడా అధికారాలను అప్పగించాలి. రైతులకు సాంకేతికత, యాంత్రీకరణ చేరువైతేనే దేశంలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుంది.
ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్రం వైఖరి సరైనదేనా?
వ్యవసాయానికి అవసరమైన నీళ్లు, ఎరువులు, విత్తనాలు అందించడం వరకే రాష్ట్రం బాధ్యత. వాటిని ఉపయోగించుకొని పంటలు పండించడం రైతుల బాధ్యత. ఆ పంటలను ఏం చేయాలన్నది పూర్తిగా కేంద్రం బాధ్యతే. పంట ఉత్పత్తులను కొని, వాటిని ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేయాల్సింది కేంద్రమే. ఎగుమతులపై కేంద్రానికి ఓ విధానమంటూ లేదు. ఎటువంటి ముందుచూపు లేకుండా.. రైతులను ధాన్యం పండించొద్దు అనడం దుర్మార్గం. పంటల ఎగుమతుల విషయంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదు. మార్కెటింగ్ పూర్తిగా కేంద్రం పరిధిలోనిదే. రాష్ర్టాల మధ్య ధరల వ్యత్యాసాన్ని, కొనుగోలు వివాదాలను పరిష్కరించి దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.
పంటలకు మద్దతు ధర దక్కకపోవడం ఎవరి వైఫల్యం?
ఎమ్మెస్పీ విషయంలో కేంద్రంలోని ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేశాయి.. చేస్తూనే ఉన్నాయి. మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన మోదీ..
తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కి.. మార్కెటింగ్పై భరోసా కలిగినప్పుడే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెస్పీ విషయంలో పూర్తిగా కేంద్రానిదే వైఫల్యం. తెలంగాణ రైతాంగం ఈ విషయాన్ని గమనించాలి. మీరు పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంపై అనే విషయాన్ని తెలుసుకోవాలి.
వ్యవసాయరంగంలో ఎలాంటి మార్పులు రావాలి? ఇందుకు ప్రభుత్వాలు ఏం చేయాలి?
ప్రధానంగా ఐదు మార్పులు రావాలి. ఇందులో ముఖ్యమైనది సాంకేతికత. రెండోది యాంత్రీకరణ. విదేశాలు యాంత్రీకరణతో దూసుకుపోతుంటే మన రైతులు అదే పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. మూడోది.. పంట ఉత్పాదకత పెరగాలి. చైనా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలో అన్ని పంటల్లో భారీ ఉత్పాదకత ఉన్నది. ఆ స్థాయికి మన దేశం చేరుకోవాలి. నాలుగోది.. దేశవ్యాప్తంగా పంటల వారీగా రైతుసంఘాలను ఏర్పాటు చేయాలి. ఐదోది.. రాష్ర్టాల్లో, దేశంలో వ్యవసాయ సలహా మండళ్లను బలోపేతం చేసి రైతులతో మమేకం చేయాలి. పంటలవారీగా రైతులు, నిపుణులతో కమిటీలు ఏర్పాటుచేసి ఆ పంటలపై ఎగుమతులు, కొత్త రకం వంగడాలపై పరిశోధన జరిగేలా చేయాలి. ఇక ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఎంత వరకు అవకాశం ఉన్నది?
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తేనే రైతులకు ఆర్థికంగా లాభం. వరిసాగుపైనే ఆధారపడకుండా ఇతర పంటలపై దృష్టి పెట్టాలి. నూనె, పప్పు గింజల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. సాగునీటి కాలువల ద్వారా చెరువులను నింపడంతోపాటు కాలువల నుంచి రైతులు నేరుగా నీటిని వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలి. ఇలా చేస్తే ప్రత్యామ్నాయ పంటల సాగు, దిగుబడి పెరుగుతుంది.