CM KCR | జూన్ రెండో తేదీ నుంచి మూడు వారాలు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కే చంద్రశేఖర్రావు సమావేశమయ్యారు. ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గత పాలకులు నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి సపోర్ట్ వ్యవస్థలైన చెరువులు, విద్యుత్, సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామన్నారు. తత్ఫలితంగానే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈనాడు తెలంగాణలో ధాన్యం దిగుబడి మూడు కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు రైతులతో సమన్వయం చేసుకుంటూ అందుకు అనుగుణమైన చర్యలను చేపట్టాలని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల జరిగిన పంట నష్టం, రైతులకు కలిగిన కష్టాలను గుణపాఠంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
`ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో వుంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వుంది. గ్రౌండ్ వాటర్ వుంది. ఇవాల మొగులు మొకం చూడకుంట కాల్వల నీల్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా వుంది. ఈ నేపథ్యంలో మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడంతో కోతలు కూడా లేటయితున్నయి. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15-20 తారీఖుల్లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి వుంటది. మరి యాసంగి ముందుగాల నాట్లు పడాలంటే వానకాలం వరినాటు కూడా ముందుకు జరుపుకోవాల్సి వుంటుంది. అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాల్సి వుంటుంది.’’ అని సిఎం అన్నారు.
`యాసంగిలో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో వుందని అది వాస్తవం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘వరి తూకం పోసేటప్పుడు కాదు. వరి ఈనే టైంలోనే చలి వుండొద్దు. ఈన్తానప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరక ముందే వరి కోసుకుంటే గింజ గట్టిగ ఉండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్య పరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితి లేకుండా..ముందే నాట్లేసుకుని ముందస్తుగా నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
యాసంగి వరి ముందుగా నాటుకుంటే తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది’ అని రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సీఎం ఆదేశాలమేరకు జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ మంత్రి సింగిరెడ్డ నిరంజన్ రెడ్డి వివరించారు. 21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి భద్ర పరచాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో నియోజక వర్గాల వారిగా, జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే పదేండ్ల ప్రగతి నివేదిక పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు. ఇప్పటికే నిర్ణయం మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల్లో ప్రదర్శించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.