హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ఈ వానకాలం రైతుల నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7,105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, మంగళవారం నాటికి సుమారు 6,500 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది రైతుల నుంచి 17 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన గన్నీ సంచులను, ప్యాడీ క్లీనర్లను, టార్పాలిన్లను పౌరసరఫరాల సంస్థ అందుబాటులో ఉంచింది.
ఈ వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. సుమారు 1.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానిలో సుమారు కోటి టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు వానకాలంలో ప్రభుత్వం 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యం అమ్మిన రైతులకు గరిష్ఠంగా వారంరోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రూ.3,500 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటికే సుమారు రూ.2 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ప్రభావం పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.