హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టంలోకి ఆగ్నేయ దిశ గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతూ.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని పేర్కొన్నది. దీంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
రాష్ర్టంలో ఈ నెల 26 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. యాదాద్రి జిల్లా వెంకిర్యాలలో అత్యధికంగా మూడు సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొన్నది.