హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 29వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈనెల 27, 28 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించిన ఉన్నట్లు పేర్కొన్నది. అలాగే మరో ఆవర్తనం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8కిలో మీటర్ల వరకు విస్తరించిందని తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. దీని ప్రభావంతో ఈనెల 29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.