హైదరాబాద్ : పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ( DGP C.V. Anand ) స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ , ఆరోగ్య భద్రత (Arogya Bhadratha) విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్షిప్లు, మెరిటోరియస్ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ, నీట్తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
సిబ్బందికి వివాహ రుణాలు, వైద్య రుణాలు, విద్యా రుణాలు, మెరిట్ స్కాలర్షిప్లు, మెరిటోరియస్ స్కాలర్షిప్లు, అదనపు కార్పస్ ఇన్సూరెన్స్, వివిధ గ్రాంట్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ వివరించారు . వెల్ఫేర్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని, హోదాల వారీగా వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
శాఖకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ల అద్దె రేట్లను పారదర్శకంగా నిర్ణయించి, సిబ్బందికి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లీజుకు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డీజీ మహేష్ ఎం. భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, షహనవాజ్ ఖాసిం, గజరావు భూపాల్, ఉదయ్ కుమార్ రెడ్డి, శరత్ కుమార్, గోపీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.