హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి.. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా ఈ నెల 13వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి.. ఆ తదుపరి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొన్నది. దీని ప్రభావంతో 14వ తేదీన మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.