TS Weather Update | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తీవ్ర తుఫానుగా మరవచ్చని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగురోజులపాటు తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వానలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సిరిసిల్ల, జనగామ, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వానలు పడతాయని వెల్లడించారు. ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని చెప్పారు.