హైదరాబాద్, సెప్టెంబర్18(నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో పలు జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఈశాన్యం వైపు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావం వల్ల వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. దీంతో సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన భారీ వర్షాలు కురవచ్చని వెల్లడించింది.