అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం
మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు
రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వాన
ఆత్మకూర్-ఎస్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదు
(నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్) : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమైన వర్షాలు శనివారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంటాయని వివరించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఆవర్తనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర ప్రాంత తీరాలకు ఆనుకొని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న వెల్లడించారు.
20 జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఇరవైకిపైగా జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్-ఎస్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల్లోని 20 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 56 చెరువులు అలుగు పోస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. మహబూబాబాద్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. వెంకటాపూర్ మండలం రామప్ప చెరువు 23 అడుగులకు చేరి కళకళలాడుతున్నది. వర్షానికి గోడ కూలి నల్లగొండలోని పద్మానగర్లో శుక్రవారం తెల్లవారుజామున తల్లీకూతురు మృతిచెందారు. మృతులు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ధర్మూర్ మండలం మాయకవలసకు చెందిన లక్ష్మి (42), కల్యాణిగా గుర్తించారు. రైల్వే బ్రిడ్జి పనులు చేసే కూలీలకు వంట చేసేందుకు లక్ష్మి నల్లగొండకు వచ్చింది. కల్యాణికి రెండు నెలల కిందటే వివాహం కాగా, ఆషాఢమాసం అని తల్లి వద్దకు వచ్చింది. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి రూ.30 వేల ఆర్థిక సాయం అందజేశారు.
రైల్వే బ్రిడ్జి కింద నీటిలో చిక్కుకొన్న బస్సు
మహబూబ్నగర్ జిల్లాలోని మాచన్పల్లి, కోడూర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీటిలో స్కూల్ బస్సు చిక్కుకొని 30 మంది విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. రైల్వే అండర్ బ్రిడ్జిలో నిలిచిన నీటిని అంచనా వేయకుండా డ్రైవర్ బస్సును అలాగే పోనిచ్చాడు. దీంతో బస్సు మూడో వంతు భాగం నీటిలో మునిగింది. విద్యార్థులు బస్సు కిటికీలను పట్టుకొని వేలాడుతూ కేకలు పెట్టారు. సూగూర్గడ్డ తండా యువకులు గమనించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రాంచంద్రాపూర్ ఉపసర్పంచ్ రాంచంద్రనాయక్ తన ట్రాక్టర్తో బస్సును బయటకు తీశారు. చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకొన్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేయాలని రూరల్ పోలీసులకు మహబూబ్నగర్ డీఈవో రవీందర్ ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. కాగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అండర్పాస్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణ లోపాలను సరిదిద్దాలని చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది.