హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట్, బాలానగర్, కూకట్పల్లి, కొండాపూర్, అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, చాంద్రాయణగుట్ట, హిమాయత్నగర్, అంబర్పేట, మల్కాజిగిరిలో వాన పడుతున్నది.
ఇక రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది.
సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీచేసింది.
ఏపీలో కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటుతుందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. తుఫాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను అప్రమత్తతపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.