హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలుగింటి దాకా ఎండలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం కురిసే చెడుగొట్టు వాన రైతులను ముంచుతున్నది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. వడగాడ్పులు ఇబ్బంది పెడుతున్నాయి. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం సా యంత్రం నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నిజామాబాద్, జగిత్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో అత్యధికంగా 6.83, నందిగామలో 2.35, సంగారెడ్డిలో 1.80, పుట్టపహాడ్లో, రంగారెడ్డి జిల్లా కాసులబాద్లో 1.63 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన పడినట్టు పేర్కొన్నది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో విత్తనోత్పతి జొన్న నేలవాలింది. అకాల వర్షాల వల్ల మార్కెట్కు తెచ్చిన పంట తడిసింది. కోతకు వచ్చిన పంట దెబ్బతిన్నది.
మరో నాలుగు రోజులు వానలు
ఈ నెల 26 వరకు రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. ఏడు జిల్లాల్లో 40 డిగ్రీలపైన,14 జిల్లాల్లో 39 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్డీపీఎస్ తెలిపింది. ములుగు జి ల్లా మేడారం, వనపర్తి జిల్లా కేతేపల్లిలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే ఐదు రోజుల్లో ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.