నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 22 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అకాల వర్షానికి అపార నష్టం కలిగింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో తాటిచెట్టు ఎక్కుతున్న ముత్యపు మల్లేశం (65)పై పిడుగుపడటంతో కిందపడి మరణించాడు. పెద్దపల్లి మండలం గొల్లపల్లిలో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుతుండగా పిడుగు పడటంతో ఆవుల మహేందర్ (45) అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షానికి తడిసింది. కోత దశలో ఉన్న వరి వడగండ్ల ధాటికి నేల రాలింది. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో శనివారం అరగంటపాటు వడగండ్లు పడ్డాయి. బలమైన ఈదురు గాలులకు పంట నష్టం భారీగానే జరిగింది. పలుచోట్ల మామిడి కాయలు నేలరాయి. చెట్లు నేలకూలాయి. హుస్నాబాద్ పట్టణంలో కల్లాల్లోని వరిధాన్యంతో పాటు మక్కజొన్న పంట, మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ మార్కెట్లో రైతులు పోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. పెనుగాలులకు పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి. చేర్యాల మండలంలో వడగండ్ల వానకు దాదాపు వెయ్యి ఎకరాల మేర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా తెలిసింది. మెదక్ జిల్లా కేంద్రంలో అరగంట పాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ పిడుగులు పడిన భారీ శబ్ధాలు రావడంతోపాటు గంటపాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పంట చేలపై ఉన్న వడ్లు కొంత మేర రాలడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు నేలరాలాయి.
మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, కురవి, సీరోలు, చిన్నగూడురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాలతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కోతకు వచ్చిన వరి నేలవాలింది. రహదారులపై చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి. మరిపెడ మండలం బావోజిగూడెంలో ఆరబోసిన ధాన్యంపై పరదాలు కప్పుతుండగా పిడుగుపడటంతో శ్రీనివాస్(21) మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. నర్సింహులపేట మండలం బంజార గ్రామంలో ఇంటి ముందు పందిరి కోసం వేసిన రేకులు గాలికి ఎగిరిపోయాయి. గోపతండాలో ఇల్లు కూలింది. తొర్రూరు మండలం అజ్మీరాతండా జీపీ పరిధిలోని ఎర్రకుంట తండాలో కోళ్లఫారం షెడ్డు కూలింది. జిల్లావ్యాప్తంగా 11,241 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.