సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) భారీ వర్షం కురిసింది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో జేవీఆర్ ఉపరితల గనులు, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోయింది. మట్టి తవ్వకాల్లో కూడా నిలిచిపోయాయి. జేవీఆర్ ఓసీ గనిలో రోజుకు సగటున 20 వేల టన్నుల బొగ్గు, సుమారు 50 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీయాల్సి ఉంటుంది. అయితే వరద నీరు చేరడంతో ఆ పనులన్నీ ఆగిపోయాయి.
ఇక కిష్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు సుమారు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వే పనులు జరుగుతున్నాయి. భారీ వర్షానికి పనులు నిలిచిపోయాయి.
కాగా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దుమ్ముగూడెం మండలంలో తాటిచెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కాలిపోయింది. చుంచుపల్లి, బూర్గంపహాడ్, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.
చుంచుపల్లి మండలం పెనగడప కొనుగోలు కేంద్రంలో రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అన్నపురెడ్డిపల్లి సహా మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లాలోని జనగామ రూరల్, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, గాలులతో కూడిన మోస్తరు వానతో మామిడితోటలకు నష్టం వాటిల్లగా కోతకు వచ్చిన వరి పంట నేలపాలైంది. ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల్లో గాలి దుమారంతోపాటు వడగండ్లు కురిశాయి.