హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశాలున్నాయని ముఖ్యంగా 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) పడవచ్చని హైదరాబాద్ వాతావరణం(Hyderabad Meteorological) కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు.
శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్(Hyderabad)తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆదిలాబాద్(Adilabad), కొమ్రుం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్(Nirmal), నిజామాబాద్(Nizamabad), జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని వివరించింది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. పగటి పూట ఎండ ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వానలు పడతాయని తెలిపింది. తెలంగాణలో గడిచిన 48 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది.