హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శనివారం ఉత్తర కోస్తాంధ్ర మీద ఉన్న ఆవర్తనం ఆదివారం బలహీన పడినట్టు పేర్కొన్నది. శనివారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంగి ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ ఆవర్తనం వచ్చే 2, 3 రోజుల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో సుమారు ఈ నెల 18న ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని వెల్లడించారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు.