హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువగా.. 16 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జనగాం, ములుగు జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయి.
ఈ నెల 26 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం పేర్కొంది. గురువారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ముందస్తుగా హెచ్చరిక జారీ చేసింది.