Rains | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రైతన్నలూ.. జాగ్రత్త.. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి. శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురిసిన వడగండ్ల వర్షాలతో తీవ్రస్థాయిలో పంటలు నష్టపోయారు. మరోసారి వర్షం హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు.. రైతులకు పలు సూచనలు చేశారు. కోసిన పంటలను ఆరుబయట ఉంచొద్దని సూచిస్తున్నారు. గోదాములు, మార్కెట్ షెడ్డులు, ఇంట్లో ఉంచాలని తెలిపారు. వరి, మక్కజొన్న పంటలకు సంబంధించి మడుల్లో నీరు నిల్వకుండా గండ్లు కొట్టాలని సూచించారు. కోసే దశలో ఉన్న కూరగాయలను వెంటనే కోసేయాలని, వచ్చే మూడు నాలుగు రోజుల పాటు పురుగు మందులు, ఎరువులు వేయొద్దని తెలిపారు.
ఉపరితల ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ వడగండ్లు పడతాయని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నదని వివరించింది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. శని, ఆదివారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పగటి పూట ఎండ ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వానలు పడతాయని తెలిపింది.