హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగలకే ప్రత్యేక రైళ్లు.. ప్లాట్ఫారం టిక్కెట్ ధరలు పెంచడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి చర్యలు రైల్వే శాఖ గతంలో చేపట్టేది. కానీ ఇప్పడు సమయం, సందర్భం లేకపోయినా లేకపోయినా రైల్వేశాఖ నిరంతరంగా ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు వడ్డనలు వేస్తున్నది. ప్రత్యేక రైళ్లు, వారాంతపు ప్రత్యేక రైళ్లు, వన్వే ప్రత్యేక రైళ్లు, ఇలా రకరకాల పేర్లతో అదనపు రైళ్లు వేసి ఇష్టారీతిగా అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. పైగా ప్లాట్ఫాం టిక్కెట్ ధరలు కూడా పెంచుతూ నడ్డి విరుస్తున్నారు. పండుగల సీజన్లో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నారు.
ప్రత్యేక రైళ్లలో సాధారణ టిక్కెట్ చార్జీల కంటే అదనంగా 30 నుంచి 50 శాతం వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రయాణ చేయాల్సినవారు గత్యంతరం లేని పరిస్థితుల్లో భరిస్తున్నారు. భారతీయ రైల్వే శాఖ తీవ్ర నష్టాల్లో ఉన్నదని, లోటు భర్తీకి మోత తప్పదని అంటూ అదనపు చార్జీలు బాదున్నారు. కరోనా అనంతర కాలంలో కేంద్ర ప్రభుత్వం సూచనలతో రైల్వేశాఖ దొడ్డిదారివడ్డనలకు పాల్పడుతుండటంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు, అదనపు చార్జీలు వసూలు చేయడంపై రైల్వే ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరుకు రవాణా ద్వారా రైల్వేశాఖకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ నష్టాలు వస్తున్నట్టు రైల్వేశాఖ చిత్రీకరిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. అన్నిమార్గాల్లో నష్టాలు వచ్చే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్ప్రెస్లు, సూపర్ఫాస్ట్ రైళ్లుగా పేర్లు మార్చుతూ.. ప్రత్యేక రైళ్ల పేరుతో తిప్పుతూ అదనపు వడ్డన వేస్తున్నారు. అదనపు చార్జీల నుంచి తమకు విముక్తి కలిగించాలని ప్రయాణికులు కేంద్రాన్ని కోరుతున్నారు.