కేసముద్రం, సెప్టెంబర్ 5 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ఎట్టకేలకు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 418వ కిలోమీటర్ రాయి వద్ద ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన సాయంత్రం నుంచి రైల్వే అధికారులు వందల మంది కూలీలు, భారీ యంత్రాల సాయంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాగా, బుధవారం అప్ లైన్ ట్రాక్ పనులు పూర్తిచేసి రైళ్ల రాకపోకలు ప్రారంభించారు.
కాగా, గురువారం ఉదయం డౌన్ లైన్ ట్రాక్ పనులను సైతం పూర్తి చేసి మొదట గూడ్స్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం గోల్కొండ, కృష్ణ, హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లను పంపించారు. దీంతో పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కొన్ని రోజులపాటు ఈ ప్రాంతంలో రైళ్ల వేగాన్ని తగ్గించి నడపనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.