మెదక్ : మెదక్ రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ పాయింట్ను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సహచర మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..దశాబ్దాల కల ఈరోజు నిజమైందన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యం అయిందని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ రైలు వచ్చిందన్నారు. త్వరగా రైలు రావాలని మన వాటా కట్టి ఏర్పాటు చేశాం. ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సనత్ నగర్ గోడౌన్ కి పంపుతున్నాం. ఇప్పుడు ఇక్కడే స్టాక్ చేసి దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపుతామని ఆయన పేర్కొన్నారు.
మెదక్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. సింగూర్ జలాలు మెదక్ కు దక్కాలనే నినాదం ఉండే.. అది నిజం చేశామన్నారు. కొందరు ఉప ఎన్నిక అంటున్నారు. ఎందుకు ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గ్యాస్ సబ్సిడీ కోత , ఉపాధి హామీలో కొత్త, ప్రభుత్వ సంస్థల కోత, ఉద్యోగాల్లో కోత ఇదీ మోదీ ప్రభుత్వం పని తీరన్నారు. ఇదీ అతడి నిజ స్వరూపమన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అంటే ఇవ్వరంట. వరంగల్ కు రైల్వై కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇవ్వరంట. కానీ ఉప ఎన్నిక మాత్రం తెస్తరట.
మీరు తెస్తామంటున్న ఉపఎన్నిక వల్ల తెలంగాణకు ఏ లాభం? ప్రజలకు ఏం లాభం అని ప్రశ్నించారు. మాటలు చెప్పేది ఎవరో..చేతల్లో అభివృద్ధి చూపెడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.