దావోస్లో తెలంగాణ పరిశ్రమల మంత్రి కే తారకరామారావు పేరు మారుమోగిపోతున్నది. రాష్ర్టానికి పెట్టుబడులు సాధించడంలో ఆయన విజనరీ ప్రెజంటేషన్కు ప్రపంచంలోని టాప్ సీఈవోలు ముగ్ధులవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు.. తెలంగాణ పారిశ్రామికవిధానం పట్ల ఆకర్షితమవుతున్నాయి.
పలు సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు చేసుకొంటున్నాయి. మరికొందరు పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రోచె, సీరమ్ వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులకు ఉత్సాహం చూపించాయి. హెచ్సీఎల్ వంటి ఐటీ కంపెనీలు, బైజూస్ లాంటి విద్యాసంస్థలు మంత్రి కేటీఆర్తో చర్చించిన అనంతరం హైదరాబాద్పై దృష్టిపెట్టాయి. తాజాగా స్విట్జర్లాండ్కు చెందిన స్టాడ్లర్ రైల్ సంస్థ ఏకంగా వెయ్యి కోట్లతో కోచ్ఫ్యాక్టరీ స్థాపనకు ముందుకొచ్చింది.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైల్ కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ సంస్థ ‘స్టాడ్లర్ రైల్’ ముందుకొచ్చింది. రెండేండ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపెనీ బుధవారం ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా దావోస్లో మంత్రి కే తారకరామారావు సమక్షంలో స్టాడ్లర్ రైల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అన్స్గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని మేధా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి.
ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే రైల్ కోచ్లను భారత్తోపాటు ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఒప్పందానికి ముందు అన్స్గార్డ్ బ్రోక్ మెయ్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని అవకాశాలపై మంత్రి కేటీఆర్ వివరించడంతో.. భారత్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకొన్నట్టు అన్స్గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు.
పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం: కేటీఆర్
తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకొచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో తయారయ్యే రైల్ కోచ్లను భారత్తోపాటు విదేశాలకూ ఎగుమతి చేయాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్న విషయం స్టాడ్లర్ నిర్ణయంతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.
ఎంతో ప్రాధాన్య ఫ్యాక్టరీ: అన్స్గార్డ్
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ తమ కంపెనీకి అత్యంత ప్రాధాన్యమైనదని అన్స్గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. ఇక్కడ పెట్టే పెట్టుబడి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తమ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తమ సంస్థకు అందిస్తున్న సహకారంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరించి ఆ ఫ్యాక్టరీని ఇతర రాష్ర్టాలకు మంజూరు చేసిన విషయం విదితమే. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు మెచ్చి హైదరాబాద్లోని మేధా సెర్వో సంస్థ ఇప్పటికే రూ.1,000 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా కొండకల్లో రైల్కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. దేశంలోని అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన ఈ కర్మాగారం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. రైల్ కోచ్లు, లోకోమోటివ్లు, ఇంటర్సిటీ ట్రైన్ సెట్స్, మెట్రో ట్రైన్స్, మోనోరైల్స్ను తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ఏటా 500 రైల్ కోచ్లు, 50 లోకోమోటివ్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. దీని ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా మరో 1,200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా, ఇప్పుడు మేధా సెర్వోతో కలిసి రూ.1,000 కోట్ల పెట్టుబడితో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్టాడ్లర్ ముందుకు రావడం విశేషం.