మంచిర్యాల : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) – పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్స్పాట్గా మారింది. ఈ ట్రాక్పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మొత్తం 102 మంది మృతి చెందగా, ఇందులో 61 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మృతుల్లో 93 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 9 మందిని ఇప్పటికీ గుర్తించలేదు అని మంచిర్యాల స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టీ సుధాకర్ తెలిపారు.
రైళ్లను ఢీకొని సుమారు 41 మంది వరకు మరణించారు. నెలకు 10 మంది చొప్పున మరణించినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో అధికంగా 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వారేనని తెలిపారు. అయితే ఈ రైల్వే ట్రాక్.. పలు నివాస సముదాయాల కాలనీల గుండా వెళ్తోంది. మంచిర్యాల, రామకృష్ణాపురం, మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు, రేచిని, కాగజ్నగర్ పట్టణాల మీదుగా వెళ్తోంది. వివిధ కారణాలతో మనస్తాపానికి గురయ్యే వ్యక్తులు.. క్షణికావేశంలో దగ్గర్లో ఉన్న ట్రాక్పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.