హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పలువురు అధికారుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసాల్లో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇంటితోపాటు మొత్తం 10 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు.
కాగా, ప్రభాకర్రావు, రాధాకిషన్ ఇప్పటికే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నారు. ఇక ఇదే కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చానల్ ఎండీ శ్రవణ్ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రెండు ల్యాప్టాప్లు, నాలుగు ట్యాబ్లు, ఐదు పెన్ డ్రైవ్లు, హార్డ్డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ నేటితో ముగియనుంది.