Caste Census | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం హామీ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ తెలంగాణలో పర్యటించే ముందు ఇక్కడ ఏం జరుగుతున్నదో, ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడో కుల గణన జరిగిన విషయాన్ని రాహుల్గాంధీకి గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని గుర్తించారు. పాలనలో ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితిపై అవగాహన రావాలన్నా కచ్చితంగా ప్రజల సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబ సమాచారం సేకరించాలని నిర్ణయించారు. అయితే సాధారణ జనాభా గణన మాదిరిగా చేపడితే నెలలు, ఏండ్ల సమయం పడుతుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఒకేరోజు సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. 2014 ఆగస్టు 19వ తేదీన ‘సమగ్ర కుటుంబ సర్వే’ జరిగింది. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వలస వెళ్లినవారు సైతం సీఎం కేసీఆర్ మాటను గౌరవించి, సమగ్ర కుటుంబ సర్వే రోజు సొంత ఊర్లకు వెళ్లి వివరాలు అందజేశారు. దాదాపు కోటి కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందజేశాయి. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలను అధికారులు విశ్లేషించారు. 2015 జనవరి నాటికి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తేలాయి.
మొదటి నుంచీ కాంగ్రెస్ దగా
కుల గణన నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ దగా చేస్తూనే ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేండ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరిస్తున్నా, పూర్తి స్థాయిలో కుల గణన చేపట్టలేదు. 1953లో ఏర్పాటైన కాకా ఖలేల్కర్ కమిషన్ కేంద్రానికి సమర్పించిన నివేదికలో 1961 జనాభా లెక్కల సమయంలోనే కుల గణన కూడా చేపట్టాలని సూచించింది. కానీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. 2011లో జనాభా లెక్కలతోపాటే 46 లక్షల కులాలు, ఉపకులాలు, గోత్ర నామాల ఆధారంగా ప్రాంతాలవారీగా జనాభా లెక్కలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించింది. అయితే అందులోని వివరాలు అసమగ్రంగా ఉన్నాయంటూ సాంకేతిక కారణాలతో ఆ నివేదికను పక్కన బెట్టింది. ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి కులగణన వివరాలు ప్రపంచానికి తెలియకుండా పోయాయి. సమాజంలోని కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పాపంలో బీజేపీ వాటా కూడా ఉన్నది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో, 2021లో అధికారంలో ఉన్న సమయంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణనను పట్టించుకోలేదు. 2021లో ప్రధాని మోదీ ప్రభుత్వం కనీసం జనాభా లెక్కలు కూడా నిర్వహించలేదు. దీంతో సామాజిక స్థితిగతులు తెలియడం లేదని, అనేక ఉపకులాలు మరింత నిరాదరణకు గురవుతున్నాయని, ఎలాంటి అవకాశాలను, రిజర్వేషన్లను పొందలేకపోతున్నాయని అనేక కమిటీలు స్పష్టం చేశాయి. వెంటనే జనాభా గణన, కుల గణన చేపట్టాలని నిపుణులు నెత్తీనోరు మొత్తుకుంటున్నా కేంద్రంలోని బీజేపీగానీ, ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్గానీ పట్టించుకోవడం లేదు. కులాల వారీగా సమగ్ర వివరాలను సేకరిస్తే సామాజంలో చీలికలు ఏర్పడి, ఆయా వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతాయని సాకులు చెప్తున్నాయి.
పథకాల అమలుకు ప్రామాణికం
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వానికి తెలిశాయి. ‘భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, భావి తెలంగాణ నిర్మాణానికి ఈ వివరాలు ప్రామాణికం కానున్నాయి’ అని ప్రభుత్వం ఆనాడే చెప్పింది. ఈ వివరాలను ప్రామాణికంగా చేసుకొని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ప్రాజెక్టులు, పథకాలతో వ్యవసాయాన్ని స్థిరీకరించడం, రైతులకు అండగా నిలవడం, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు పెన్షన్లు, యాదవులకు గొర్రెల పంపిణీ పథకం, రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు సబ్సిడీలు, దళితుల అభ్యున్నతికి పథకాలు వంటి అనేక కార్యక్రమాలను ఈ సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం చేపట్టింది. ఏయే వ్యాధులతో ఎంత మంది బాధపడుతున్నారో కూడా ఈ సర్వేతో గుర్తించింది. వైద్యరంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, పటిష్ఠం చేసింది. తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచింది.