నల్లగొండ : కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరిని జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఎవరిని ఉద్దరిస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
సూర్యాపేటలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపమే పెద్ద శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో నాయకత్వ లేమి కాంగ్రెస్ పార్టీని ఎక్కిరిస్తుందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలలో రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతు న్నాయన్నారు. అక్కడ గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని, ఎగిరేది గులాబీ జెండాయేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలలో దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు. యావత్ భారత దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుందని, రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణ అభివృద్ధి దేశం మొత్తానికి విస్తరించాలి అన్నదే దేశ ప్రజల ఆకాంక్ష అని ఆయన చెప్పారు.