Revanth Reddy | హైదరాబాద్, జూలై 2, (స్పెషల్ టాస్క్ బ్యూరో -నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కన పెట్టిందా? ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఖమ్మం సభ సాగిన తీరు. పార్టీలో మున్ముందు టీపీసీసీ అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని అధిష్ఠానం కలిగించింది. సభ అరంభం నుంచి ముగింపు వరకు రేవంత్రెడ్డిని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పెద్దగా పట్టించుకోనట్టే వ్యవహరించారు. వేదికపై తన పక్కన కూర్చున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనే రాహుల్గాంధీ ముచ్చటిస్తూ కూర్చున్నారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతోపాటు పాదయాత్ర పూర్తిచేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందించే ఉద్దేశంతో గర్జనసభ పేరుతో ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించింది. దీనిని భట్టి విక్రమార్కకు అభినందన సభగా నిర్వహించాలని సీనియర్ నేతలు పట్టుబట్టగా.. పొంగులేటి చేరిక సభగా నిర్వహించి అదే వేదికపై భట్టికి అభినందన తెలియజేస్తే సరిపోతుందని రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. పార్టీ సీనియర్ల అభిమతం ప్రకారమే భట్టి విక్రమార్కకు అభినందన సభగా నిర్వహించి పొంగులేటి చేరికకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. రేవంత్రెడ్డి మాట కంటే సీనియర్ల అభిప్రాయానికే అధిష్ఠానం ఎక్కువ ప్రాధా న్యం ఇస్తుందనే విషయం తేటతెల్లమైంది. భట్టి పాదయాత్రను అభినందిస్తూ ఆయన మెడలో కండువా కప్పిన రాహుల్గాంధీ.. భట్టి భుజంపై చేతులేసి, ముందుకు తోడ్కొని వచ్చి ప్రజలకు అభివాదం చేయించారు. రేవంత్ పక్కనే ఉన్నా రాహుల్గాంధీ పట్టించుకోనట్టే వ్యవహరించారు.
పొంగులేటి వ్యాఖ్యలపై గరంగరం
సభ ఏర్పాట్లకు పొంగులేటి కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, వేదికపై భట్టికే అధిక ప్రాధాన్యం దక్కంది. సభకు తరలివచ్చిన జనమంతా తన కోసం, తాను సమీకరించిన వారేనని చెప్పడానికి పొంగులేటి ప్రయత్నించారు. తన ప్రసంగంలో సభకు వచ్చిన వారంతా తన కుటుంబసభ్యులని చెప్పడంతో వేదికపై ఉన్న పార్టీ పెద్దలు విస్తుపోయారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి క్యాడరే లేదన్నట్టు, వచ్చిన వారు ఆ పార్టీ క్యాడరే కాదన్నట్టు వారిని తన కుటుంబ సభ్యులుగా పొంగులేటి అభివర్ణించడంతో భట్టి షాక్ తిన్నారు. పొంగులేటి వైపు భట్టి గుర్రుగా చూడటం స్పష్టంగా కనిపించింది. రాహుల్గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ క్యాడర్ను పొంగులేటి లెక్క చేయకుండా ఓవర్ యాక్షన్ చేశారని, ఈ పరిణామం మున్ముందు పార్టీకి ఇబ్బందికరమేనని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాగా రాహుల్గాంధీ ప్రసంగానికి ఉత్తమ్కుమార్రెడ్డి అనువాదకునిగా వ్యవహరించారు. ఇది కూడా రేవంత్రెడ్డి వర్గానికి మింగుడుపడని అంశమే. పొంగులేటిని పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి మొదటి నుంచి సుముఖంగా లేరు. తాను భట్టి విక్రమార్క కోసమే సభకు వచ్చినట్టుగా వ్యవహరించారు. వేదికపై రేణుకాచౌదరి మాట్లాడుతారని ప్రకటించినప్పటికీ ఆమె పట్టించుకోనట్టే వ్యవహరించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ప్రసంగిస్తారని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, ఆయనకు అవకాశం దక్కలేదు. చివరకు వేదికపై నుంచి రాహుల్గాంధీ దిగిపోయే సమయంలో కోమటిరెడ్డి ప్రసంగించే ప్రయత్నం చేశారు. భట్టి పాదయాత్రను తన ప్రసంగంలో ప్రస్తావించిన రాహుల్గాంధీ.. ఎక్కడా రేవంత్రెడ్డి గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించక పోవడం ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనడానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.