Rahul Gandhi | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హయాంలో దేశం అథోగతి పాలైందని, వ్యవసాయరంగం కునారిల్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన మోదీ ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం దేశ సంపదను దోచిపెట్టిందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం సాయంత్రం జరిగిన జనజాతర సభలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించింది.
శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోను తుక్కుగూడ సభలో రాహుల్ ప్రజల ముందు ఉంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము ఇక్కడ విడుదలచేసింది మ్యానిఫెస్టో కాదని, అది దేశ ప్రజల మనోగత పత్రమని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50 వేలు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
మహిళలకు లక్ష రూపాయలు
కాంగ్రెస్ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే ‘నారీ న్యాయ్’ పథకం కింద ప్రతి కుటుంబంలో ఓ మహిళకు లక్ష రూపాయల ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి నిరుద్యోగికి ఏడాదిపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో శిక్షణ ఇవ్వడంతోపాటు లక్ష రూపాయల భృతి ఇస్తామన్నారు. ‘రైతున్యాయం’ పథకం పేరిట రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ సిఫార్సులు అమలుచేసి పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు.
దేశంలో 50 శాతం ఉన్న ఓబీసీలకు, 15 శాతం చొప్పున ఉన్న ఎస్సీ, మైనార్టీలు, 8 శాతం ఉన్న ఎస్టీలకు మోదీ సర్కార్లో సమన్యాయం లభించలేదని ధ్వజమెత్తారు. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నిరాదరణకు గురైన వర్గాలకు చేయుతనిస్తామని హామీ ఇచ్చారు.
మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఐదు హామీల్లో ఒక్కో దాంట్లో వేర్వేరుగా మరో ఐదు హామీలు పొందుపరిచినట్టు తెలిపారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని బలవంతపు వసూళ్లకు పాల్పడిందని, చివరకు ఎన్నికల సంఘంలోనూ మోదీ తన ఏజెంట్లను పెట్టుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి అతిపెద్ద కుంభకోణమని రాహుల్గాంధీ ఆరోపించారు.
‘నమో’ అంటే నమ్మితే మోసం: రేవంత్రెడ్డి
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఏమిచ్చిందని, సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఏడాదికి రెండుకోట్ల చొప్పున ఈ పదేండ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీనైనా మోదీ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. ‘నమో’ అంటే నమ్మితే మోసం అని నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.
నేను జానారెడ్డిని కాదు..
తాను జానారెడ్డిని కాదని, రేవంత్రెడ్డినంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తీవ్ర పదజాలంతో రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నామని, ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిన గ్రామాల్లో మీరు ఓట్లు అడగాలని, ఎవరు గెలుస్తారో చూద్దామని సవాలు విసిరారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. జనజాతరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షత వహించగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు ప్రసంగించారు.
ఫిరాయింపులు చేస్తూ చట్టానికి సవరణా?
తుక్కుగూడ వేదికగా నిర్వహించిన సభలో విడుదల చేసిన మ్యానిఫెస్టో అంతా ఉత్తదేనని, దానిపై కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ‘పాంచ్ న్యాయ్- పచ్చీస్ గ్యారెంటీ’ పేరిట తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోను రాహుల్గాంధీ ప్రజల ముందు ఉంచారు. అందులో 13వ అంశంగా పార్టీ ఫిరాయింపుదారుల చట్టానికి సవరణ చేస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరూ ఇటీవల కాంగ్రెస్లో చేరారు. వారిద్దరినీ సభావేదికపైనే పెట్టుకుని మ్యానిఫెస్టోలో ఈ విషయం పేర్కొనడంపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ దెబ్బతో తేటతెల్లమైందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.