Rahul Gandhi | భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. రాహుల్ తమాషాలు చూస్తూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనను అందుకోలేక స్థానిక కాంగ్రెస్ నేతలు చతికిలబడిపోతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్క పని చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెలంగాణలోకి అడుగుపెట్టిన జోడో యాత్రలో రాహుల్ తన ఉత్సాహాన్ని ప్రదర్శించి చిన్నా పెద్దా, ఆడా మగా.. ఇలా అందర్నీ ఆకర్శిస్తున్నారు. తనతో నడుస్తున్న పలువురు కాలికి బొబ్బలతో దవాఖానలకు పోతుంటే.. రాహుల్ మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందుకు కదులుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.
తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భిన్నమైన శైలితో అలరించారు. జడ్చర్లలో ర్యాలీకి వచ్చిన స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ ఒక్కసారిగా రాహుల్ పరుగు మొదలెట్టాడు. రాహుల్ ఏం చేస్తున్నాడో తెలియక అక్కడున్న వారు అయోమయానికి గురై.. తేరుకుని ఆయనతో పరుగు తీశారు. రాహుల్ స్పీడ్ను పిల్లలు కూడా అందుకోలేక పోయారు. రేవంత్రెడ్డి కూడా వెనుకబడిపోయారు. యాత్ర కర్ణాటకలో కొనసాగిన సందర్భంలో కూడా రాహుల్ ఒక్కసారిగా రన్నింగ్ చేయడంతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. సిద్దరామయ్య చేతు పట్టుకుని పరుగు లంఘించడంతో అక్కడి నేతలు కేకలు వేస్తూ ఉత్సాహపరిచారు.
అనంతరం రాహుల్ యాత్ర గొల్లపల్లికి చేరుకున్నది. అక్కడి మహిళలతో కలిసి రాహుల్ బతుకమ్మ ఆడారు. జైరాం రమేష్, రేవంత్రెడ్డి ఆయనతో పాదం కదిపారు. బతుకమ్మ పండుగ గురించి స్థానిక నేతలను అడిగి తెలుసుకున్న రాహుల్.. అక్కడ పెట్టిన బతుకమ్మలకు నమస్కారం చేశారు.
తెలంగాణలో ఇవాళ 22 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తి చేయనున్నారు. యాత్ర ముగిశాక సాయంత్రం షాద్నగర్ సోలీపూర్ జంక్షన్లో నిర్వహించే సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. శనివారం 20 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ ఆ రాత్రి జడ్చర్లలో బస చేశారు.