పెద్దపల్లి : తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నాడు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. పెద్దపల్లి పట్టణంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ది. అధికారం కోసం ఎంత నీచమైన స్తాయికైనా దిగజారే పరిస్థితి వారిదని మండి పడ్డారు. తెలంగాణ రావొద్దని అడ్డం పడ్డ ద్రోహి చంద్ర బాబుతో ఎవరన్నా పొత్తు పెట్టుకుంటారా..అధికారం కోసం ఆత్మాభిమానం మంట గలుపుతారని అని కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మాది బతుకు దెరువు కోసం ఆరాటం.. వాళ్లది కుర్చీల కోసం కొట్లాట అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాహుల్ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా అయ్యిందని ఎద్దేవా చేశారు. మిస్టర్ బండి సంజయ్.. కేంద్రంలో ఉన్న 15.62 లక్షల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
తాజాగా 90 వేల ఉద్యోగాల భర్తీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు. కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత. రైతుల కష్టాలు, కన్నీళ్లు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్లు రాక పంటలు ఎండి పోయేవి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఇస్తున్నట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు.
ఒకప్పుడు నీళ్ల కోసం ధర్నాలు. ఇప్పుడు నీళ్లు ఎక్కువ అవుతున్నాయి ఆపండి అంటున్నారు. ఇదీ సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ హయాంలో 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే.. ఇప్పుడు 2.59 కోట్ల మెట్రిక్ టన్నులు పండుతున్నది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం మేం కొనలేము అని చేతులు లేవట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కోతలు ఉన్నాయి. వారానికి రెండు రోజులు పవర్ హాలిడే లు పెడుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కానీ తెలంగాణలో నిరంతర విద్యుత్ పంపిణీ కొనసాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. రూ. 18 కోట్లతో 100 పడకల మాతా శిశు హాస్పిటల్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
నాటికి నేటికి సర్కార్ దవాఖానల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతానికి చేరిందన్నారు. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారు.
ఇప్పటికే నీళ్లు, వ్యవసాయంపై దృష్టి సారించింది ఎంతో పురోగతిని సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు విద్య, వైద్యం ప్రాధాన్య అంశంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మెడికల్ కాలేజీల వల్ల ఇక్కడి ప్రాంతాలు రూపురేఖలు మారుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, రమణ, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కోరుకుంటి చందర్, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.