Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ్యర్థిని ప్రకటించి పార్టీలో ‘సీఎం అభ్యర్థుల’ తేనెతుట్టెను కదిపారు. మాజీ సీఎం కమల్నాథ్ను సీఎం అభ్యర్థిగా రాహుల్ శనివారం భోపాల్ సభలో ప్రకటించారు. దీంతో ఇతర రాష్ర్టాల్లో కూడా పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా? అనేది తాజాగా పార్టీలో, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్, చత్తీస్గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. అలాంటిది ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే సీఎం అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నికలు జరిగే ఇతర రాష్ర్టాలలో తేనెతుట్టేను కదిపినట్టు అయిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాలనే డిమాండ్ ఎన్నికలు జరుగనున్న ఇతర రాష్ర్టాల నుంచి కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్టేనని విశ్లేషిస్తున్నారు.
సహాయ నిరాకరణ ప్రమాదం
సీఎం అభ్యర్థిని ముందే ప్రకటిస్తే ఆ పదవి ఆశించే మిగతా నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే ప్రమాదం ఉంటుందన్నది కాంగ్రెస్ యోచన. ఆ వ్యూహంతోనే కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరికీ సీఎం పదవిపై ఆశలు కల్పించి పార్టీ గట్టెక్కింది. కానీ ఆ తర్వాత డీకేను పక్కనపెట్టి సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చొబెట్టింది. తమ పార్టీ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించదని, ఇది తమ విధానం అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా మధ్యప్రదేశ్లో సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటించడంతో పార్టీ అధిష్ఠానం చిక్కుల్లో పడింది. ఎన్నికలు జరిగే ఇతర రాష్ర్టాలలో రాహుల్ సీఎం అభ్యర్థి చిచ్చు రాజేసిందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జోరుగా పార్టీలో కుమ్ములాటలు
ఇప్పటికే రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీల్లో గ్రూపుల కుమ్ములాటలు నడుస్తున్నాయి. అక్కడ సీఎం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేత సచిన్ పైలట్ తిరుగుబాటు చేయగా.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే సీఎం సీటు ఇస్తామని అంతర్గతంగా బుజ్జగించినట్టు పార్టీ వర్గాల సమాచారం. కానీ, మధ్యప్రదేశ్లో తాజాగా సీఎం అభ్యర్థిని ప్రకటన నేపథ్యంలో తన పేరును కూడా ప్రకటించాలని సచిన్ పైలట్ డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పార్టీ ఇరకాటంలో పడకతప్పదని ఈ వర్గాలు అంటున్నాయి. ఇక్కడ సచిన్ ఒత్తిడికి లొంగితే చత్తీస్గఢ్, తెలంగాణ నుంచి కూడా సీఎం అభ్యర్థి ప్రకటనలపై డిమాండ్ వస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ వర్గాలు ఆందోళనలో పడినట్టు తెలుస్తున్నది.
అధికారంలోకి వస్తే నేనే సీఎం..
తెలంగాణ నుంచి సీఎం పదవిని ఆశించే నాయకులు కనీసంగా అర డజన్ మంది వరకు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ తదితరులంతా తమకు తామే సీఎం అభ్యర్థులుగా భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎంనని కొందరు బాహాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లో పార్టీ నుంచి సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాకుండా రాహుల్ గాంధీ ప్రకటించడం ఏమిటన్నది కూడా మరో వివాదంగా మారబోతుందా? అన్నది వేచి చూడాలి.