Shehzad Poonawalla : ప్రధాని మోదీపై బీజేపీ కీలక నేత షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని పూనావాలా వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శనివారం పూనావాలా ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిలో పరోక్షంగా ప్రధాని మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సయమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.
‘‘మోదీ ప్రధాని పదవి చేపట్టి పన్నెండేళ్లైంది. ఆయన విఫలమయ్యారు. సరైన నియంతగా ఎలా మారాలో కూడా ప్రధానికి తెలియదు. నేను పూర్తిగా నిరాశచెందా. తనపై, తన తల్లిపై బూతులతో, ఘాటు విమర్శలు చేసిన పిల్లల గురించి గతరాత్రి మోదీ ఒక వీడియో విడుదల చేశారు. ఆ పిల్లలంతా అల్లరివాళ్లని, వారిని క్షమించాలని కోరారు. తనపై విరుచుకుపడ్డ వారిని క్షమించాల్సిందిగా సొసైటీని, పోలీసుల్ని, ప్రతి ఒక్కరిని మోదీ కోరారు. పిల్లలు అభ్యంతరకర భాషలో బూతులు తిడితే, మీరు వాళ్లను క్షమిస్తున్నారు. పిల్లలు తప్పులు చేస్తారని, వారు సరైన దారిలో నడిచేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు. రాహుల్ గాంధీని చూడండి. ఆయన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధాకి వారసుడు. మోదీజీ.. నిజమైన నియంతృత్వం అంటే ఏంటో, ఎమర్జెన్సీ అంటే ఏంటో వారిని చూసి నేర్చుకోండి. మీరు వామపక్షవాదులందరి ఆశలను కూల్చేశారు. అలాగే, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే రాహుల్ గాంధీ మాత్రం వెంటనే వారిపై కేసులు పెట్టిస్తున్నారు’’ అంటూ పూనావాలా వ్యాఖ్యానించారు.
ఇటీవల నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో పలువురు విద్యార్థులు మోదీని తిడుతూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేశారు. కానీ, వారందరినీ క్షమిస్తున్నానని, ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కోరుతూ ప్రధాని మోదీ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ మోదీ తీరుపై వస్తున్న విమర్శలకు పూనావాలా వ్యంగ్యంగా బదులిచ్చారు. అది కూడా రాహుల్ గాంధీని నియంతలతో పోలుస్తూ పూనావాలా స్పందించారు.