వరంగల్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు సంఘర్షణ యాత్ర పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ చప్పగానే సాగింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ వచ్చినా సభలో జోష్ కనిపించలేదు. అంతంత మాత్రంగానే సభ సాగటంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంతో ఇంటిబాట పట్టారు.
హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేటలో 200 ఎకరాల్లో టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించగా, తాజాగా కాంగ్రెస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ సభను నిర్వహించింది. 20 ఎకరాల కాలేజీ గ్రౌండ్లో బారికేడ్లతో దాదాపు సగం వరకు మినహాయించి సభ ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ నిర్వహించిన 10 లక్షల మంది సభలో ఐదో, పదో వంతు కూడా కాంగ్రెస్ సభకు రాలేదు. సభ నిర్వహణ కూడా సరిగా లేదు.
కాంగ్రెస్ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్నే రాహుల్గాంధీ అప్పగించటంతో చాలామంది మధ్యలోనే వెళ్లిపోవటం కనిపించింది. సభలో రాహుల్గాంధీ ఎదుటే టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలస్యంగా టికెట్లు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో అలా చేయొద్దని ప్రసంగంలో చెప్పడంతో రాహుల్గాంధీ ఇబ్బందిగా కనిపించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అసలు బహిరంగ సభకే రాలేదు.
కాంగ్రెస్ బహిరంగసభ ఏకపక్షంగా సాగడంతో సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, జీవన్రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. బహిరంగ సభ జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నేతలకూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆదేశాల మేరకే సీనియర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని హస్తం పార్టీ నేతలు చర్చించుకొన్నారు.
రాహుల్గాంధీ బహిరంగ సభ ఫ్లెక్సీలు కట్టే విషయంలో హస్తం పార్టీ నేతలు కొట్టుకున్నారు. వరంగల్-హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అనుచరులు గురువారం అర్ధరాత్రి తర్వాత అదాలత్ జంక్షన్లో ఫ్లెక్సీలు కట్టేప్పుడు ముష్టియుద్ధాలకు దిగారు.