హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబాఫూలే వారసుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎంబీసీ కో కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారుతోనే రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయా వర్గాలు అనేక అవమానాలకు గురయ్యారని, తెలంగాణ ఏర్పాటయ్యాకే వారికి న్యాయం జరుగుతున్నదని తెలిపారు.
గడచిన 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు గత రెండేండ్ల నుంచి సెలూన్లు, దోభీఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు అత్యంత ఖరీదైన రెండెకరాల స్థలంలో రూ.2 కోట్లతో, రజకులకు మూడెకరాల్లో రూ.3 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని, దేశమే అబ్బరపడేలా ఊతమిస్తున్నదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రజకులు, నాయీబ్రాహ్మణుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.