హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి, అభివృద్ధి పథాన నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్కు హ్యాట్సాఫ్ అంటూ పీపుల్స్స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. ‘కేసీఆర్ పాలనలో అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్యాంలు నిర్మిస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. ఎక్కడ చూసినా పంట పొలాలతో పచ్చదనం కనిపిస్తున్నది. రాష్ట్రమంతా పచ్చ రంగు పూసుకున్నట్టుగా ఉన్నది. కేసీఆర్ విజన్కు హ్యాట్సాఫ్. కరువుల నుంచి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా.. గతంలో కార్మికులు, కూలీలు పాలమూరు, మెదక్, కరీంనగర్ నుంచి ముంబై, సూరత్ వంటి నగరాలకు ఉపాధికోసం వెళ్లిపోయేవారు. ఇప్పుడు పొరుగు రాష్ర్టాల నుంచి తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణను ఇంతటి అభివృద్ధి పథాన నడిపిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుంది’ అని నారాయణమూర్తి కొనియాడారు. శనివారం ఆయన రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హైదరాబాద్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. సంతోష్కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నారని, పరోక్షంగా పర్యావరణ మంత్రి అనే పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ చాలెంజ్గా తీసుకుని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ విధ్వంసం కాకుండా కాపాడుకున్న చోటే సమస్త జీవరాశి మనుగడ సాగిస్తుందని చెప్పారు. నాడు ఆదివాసీ బిష్నోయ్ తెగ మహిళలు, సుందర్లాల్ బహుగుణ వంటి ప్రముఖులు పర్యావరణంపై ప్రదర్శించిన శ్రద్ధనే నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదని కొనియాడారు.