R Krishaniah | చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడుఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ అధికారంలో బీసీలకు న్యాయమైన వాటా లభించనంత వరకు సామాజిక న్యాయం సాధ్యంకాదని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. అసెంబ్లీ, పార్లమెంటులో బీసీలకు 50శాతం సీట్లు రిజర్వు చేసేందుకు ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు తీర్మానం చేశాయని ఆయన లేఖలో గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో ఆశించిన ప్రయోజనం లేదని, రాజకీయ అధికారం ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించడం వల్ల చట్టసభల్లో ఉన్నతస్థానాలకు ఎదిగే అవకాశం ఏర్పడిందని, 54శాతం జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు లేనందున అలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారన్నారు.
దేశంలో 2,600 బీసీ కులాలు ఉండగా, 75ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో చట్టసభల్లోకి కేవలం 50బీసీ కులాలు మాత్రమే ప్రవేశించాయని, అలాగే జనాభాలో 54శాతం బీసీలు ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యుల్లో బీసీల వాటా కేవలం 15శాతం మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగాన్ని 121సార్లు సవరించినా బీసీల సంక్షేమానికి సంబంధించి ఒక్క సవరణ కూడా చేయలేదన్నారు. దేశంలో కుల ఆధారిత సామాజిక వ్యవస్థ నిర్మితమై ఉందని, అన్ని కులాలకూ రాజకీయ సమ ప్రాతినిధ్యం లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం కాజాలదన్నారు. రాజకీయపార్టీలు క్యాబినెట్లో బీసీలకు అప్రాధాన్య శాఖలు కేటాయించి బీసీలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయని, దాంతో బీసీల సమస్యలు పరిష్కారం కావని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.