ముషీరాబాద్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తూ తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్ విద్యానగర్లోని బీసీభవన్లో నిర్వహించిన నిరుద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుండా బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ తదితర రంగాలతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను సైతం భర్తీ చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు భంగకరంగానూ, పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగానూ మారుతున్నాయని దుయ్యబట్టారు. అన్నింటినీ ప్రైవేటీకరిస్తున్న మోదీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని కూడా ప్రైవేట్పరం చేస్తుందా? అని ఎద్దేవా చేశారు. ప్రజావ్యతిరేక మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పలు యూనివర్సిటీల్లో 1,820 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ పాలకమండళ్లు జాప్యం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు జిల్లపల్లి అంజి, బబ్లుగౌడ్, ప్రభాకర్, బ్రహ్మయ్య, రాజ్యలక్ష్మి, వెంకటేశ్ పాల్గొన్నారు.