మెహిదీపట్నం, జూలై 4 : రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిలు రూ.8వేల కోట్ల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. రూ.8వేల కోట్ల బకాయిలకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. వెంటనే మొత్తం బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు ఉన్నత చదువులతోపాటు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి, రాజేందర్, అనంతయ్య, గుజ్జ కృష్ణ, సిద్ధూయాదవ్, వంశీయాదవ్, బలరాం, నరేశ్గౌడ్, బాలయ్య పాల్గొన్నారు.