రవీంద్రభారతి, జనవరి 5: ఈ నెల 29, 30 తేదీల్లో వేలాది మంది బీసీలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కులగణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ ఆందోళనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి బీసీలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వరిని నియమించారు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ)గా బీసీ న్యాయవాదిని నియమించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లోని ప్రభుత్వ న్యాయవాద పోస్టుల్లో 50 శాతం బీసీలకే కేటాయించాలని కోరారు. అన్ని నామిటేడ్ పోస్టుల్లోనూ బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.