రవీంద్రభారతి, డిసెంబర్ 9: పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.
తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. తొలగించిన 26 బీసీ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. తెలంగాణ యువత ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగులను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని కోరారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీలా వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.