హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): జనగణనతోపాటు బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. గురువారం ఆయన హైదరాబాద్లోని బీసీభవన్లో చలో ఢిల్లీ కార్యక్రమ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. తమ డిమాండ్ల సాధనకు పార్లమెంటుతోపాటు మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని చెప్పారు. కులగణన చేపట్టాలని ఎనిమిది రాష్ర్టాల అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 10న ప్రతిపక్ష నేతలు, బీసీ నాయకులతో అఖిలపక్ష రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, చంటి ముదిరాజ్, కృష్ణయాదవ్, నారాయణ, ఉదయ్, భాస్కర్ ప్రజాపతి, రఘు, చరణ్యాదవ్ పాల్గొన్నారు.